posted on May 22, 2025 2:39PM
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈడీ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ సర్వోత్న న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని జస్టిస్ గవాయి మండిపడ్డారు. ప్రభుత్వ మార్కెటింగ్ కార్పొరేషన్ సంస్థపై ఈడీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి, ఒక ప్రభుత్వ సంస్థను దోషిగా ఎలా చిత్రీకరిస్తారంటూ ఈడీని నిలదీసింది. తమిళనాడులోని సర్కారు లిక్కర్ షాపులపై ఈడీ చేపట్టిన దాడుల విషయంలో సుప్రీంకోర్టు గ్రహం వ్యక్తం చేసింది.
మద్యం రవాణా, బార్ లైసెన్సుల మంజూరు, బాటిల్ తయారీ సంస్థలు మరియు డిస్టిలరీలతో కుమ్మక్కై నిధుల దుర్వినియోగం ద్వారా లెక్కల్లో చూపని నగదును ఆర్జించారన్న ఆరోపణలపై ఈడీ మార్చిలోనూ, గత వారంలోనూ తమిళనాడులోని ప్రభుత్వ లిక్కర్ షాపులపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల సమయంలో అనేక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిలోని డేటాను క్లోన్ చేశారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, “మీరు వ్యక్తులపై కేసులు నమోదు చేయవచ్చు… కానీ కార్పొరేషన్లపైన ఎలా చేస్తారు? మీ ఈడీ అన్ని హద్దులూ మీరుతోంది!” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది.