posted on May 13, 2025 12:39PM
స్టార్ బ్యాటర్, స్ఫూర్తిదాయక కెప్టెన్, ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లిని ఇక మనం తెల్లజెర్సీలో చూడలేం. టీ 20 లీగ్లకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులను టెస్టు క్రికెట్ వైపు ఆకర్షించి, వారిని ఆటకు అతుక్కుపోయేలా చేసి.. ఉత్తేజపరిచి, ఉర్రూతలూగించిన కింగ్ సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్బై చెప్పేశాడు. దాదాపు దశా బ్దంన్నర పాటు టీమిండియాకు వెన్నెముకలా నిలిచిన విరాటుడు.. దీర్ఘఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు.
నిరుడు టీ 20ల నుంచి రిటైరైన కోహ్లి.. ఇక వన్డేల్లో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీని యర్లకు ‘చీకూ’గా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగ్గా భారత క్రికెట్లో అంతర్భాగమైన కోహ్లిని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెలితే. అది పూడ్చలేనిది. అతడు బ్యాటుతో పరుగుల వరద పారించడమే కాదు.. సారథిగా భారత జట్టు టెస్టులు ఆడే తీరునే మార్చేశాడు.
విదేశాల్లో తడబడే అలవాటున్న టీమ్ఇండియా.. కోహ్లి నాయకత్వంలో దూకుడును అలవర్చుకుంది. బోర్డర్-గావస్కర్ సిరీస్లో భాగంగా జనవరిలో సిడ్నీలో ఆడిన ఐదో టెస్టే కోహ్లి కెరీర్లో ఆఖరి టెస్టు.
అది 2014 డిసెంబర్.. భారత టెస్ట్ క్రికెట్ పాతాళానికి పడిపోతున్న క్షణం. ఐసీసీ పాయింట్స్ టేబుల్లో 7వ స్థానం. మేటి ఆటగాళ్లంతా రిటైర్మెంట్ ప్రకటించారు. రెండు ప్రపంచకప్లు అందించిన ధోనీ కూడా.. కెప్టెన్సీ వదిలి జట్టుకు దూరం అయ్యాడు. టీం భవిష్యుత్ ఏంటనేది అందరిలో ప్రశ్నార్థకం. భారత టెస్ట్ క్రికెట్ ఇక కనుమరుగయిపోతుంది అనుకున్న క్షణం.. అప్పుడొచ్చాడు విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్లో తాను కింగ్ అని నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. టీమిండియా అభిమానుల్లో ఆశలు పెంచి.. సంప్రదాయ విధానాలను సవాల్ చేస్తూ.. కొత్త తరహా టీమిండియాను తయారు చేయడంలో సఫలం అయ్యాడు.
టెస్టులు ఎవరు చూస్తారులే అనుకున్న వాళ్లను స్టేడియాలకు రప్పించాడు కోహ్లీ. క్రికెట్ అభిమానులను టీవీలకు అతుక్కుపోయేలా చేశాడు. టీ 20లే కాదు.. టెస్టులు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనిపించేలా చేశాడు. భారత టెస్ట్ క్రికెట్ రాత మార్చాడు. విదేశీ గడ్డపై టీమిండియా అంటే చెమటలు పట్టేలా చేశాడు. అప్పటివరకు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డపై భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిందే లేదు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్ల స్లెడ్జింగ్కు మనవాళ్లు ముందే చిత్తయ్యేవాళ్లు. కానీ కెప్టెన్గా కోహ్లీ వారి సొంతగడ్డ పైనే వారికి దీటుగా జవాబిచ్చేవాడు. టీమిండియా ప్లేయర్ల జోలికి ఎవరైనా రావాలంటే ముందు తనను దాటాలని ప్రతి టీంకు చాటి చెప్పాడు.
మరో రెండు దశాబ్దాలు పైబడినా.. బెస్ట్ టెస్ట్ కెప్టెన్ అంటే కోహ్లీ పేరు చెప్పేలా చేశాడు. భారత టెస్ట్ క్రికెట్ కెరీర్ కోహ్లీకి ముందు.. కోహ్లీకి తర్వాత అని చెప్తారు ఎవరైనా. ఎందుకంటే ఒకటి కాదు.. రెండు కాదు.. విరాట్ టెస్ట్ కెప్టెన్గా పగ్గాలు అందుకున్న తర్వాత.. ప్రపంచ క్రికెట్లో భారత్ చక్రం తిప్పింది. 2017 నుంచి 2021 వరకు ఐదేళ్లు టీమిండియాను నెంబర్ వన్గా నిలబెట్టాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన కెప్టెన్ ఎవరూ లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా భారత్ ను వరుసగా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు తీసుకెళ్లాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 68 మ్యాచ్లు ఆడి.. 40 విజయాలు సాధించింది. మరో 11 మ్యాచ్లను డ్రా చేసుకుంది. కోహ్లీ సారథ్యంలో సొంతగడ్డపై 11 టెస్ట్ సిరీస్లు గెలిచింది. విదేశాల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్గానూ రికార్డు విరాట్ కోహ్లీ పేరుమీదే ఉంది.
కోహ్లీ సారథ్యంలో విదేశాల్లో భారత్.. 15 విజయాలు నమోదు చేసింది. కెప్టెన్గా వరుసగా అత్యధికంగా 9 టెస్ట్ సిరీస్ గెలిచింది కూడా కోహ్లీనే. ఆడిలైడ్, పెర్త్ గడ్డపై కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. అలాంటిది వాళ్ల సొంతగడ్డపైనే వారిని మట్టి కరిపించి.. వరుసగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను గెలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన మొదటి భారత కెప్టెన్గా నిలిచాడు. అటు ఇంగ్లాండ్ గడ్డపై భారత్ విశ్వరూపం కొనసాగడానికి కారణం కోహ్లీనే. ఆటగాడిగా.. కెప్టెన్గా తోటి ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అదే టీమిండియా రాత మార్చింది. విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా టెస్ట్ జట్టును ఊహించుకోవడం చాలా కష్టం. కెప్టెన్గా తాను 2022లో రిటైర్ అయినా.. లీడర్గా రోహిత్ శర్మకు విలువైన సలహాలు అందించాడు. రోహిత్ టీంను నడిపించలేని టైంలో.. తాను ముందుకు వచ్చి భారత్ను రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరో ప్లేయర్, మరో కెప్టెన్, మరో లీడర్ను భారత క్రికెట్ చూడటం కష్టమే.