posted on May 20, 2025 3:57PM
ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత పాక్ భారత్ లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడటం, వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టడం అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు ఒకింత సడలినా.. పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే భారత్ వ్యూహాత్మకంగా పాకిస్థాన్ పై దౌత్యయుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే.. పహల్గాం ఉగ్రవాదికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. తదననంతర పరిణామాలను ప్రపంచ దేశాలకు వివరించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అఖిలపక్ష ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడు ప్రతినిథి బృందాలకు అఖిల పక్షాలకు చెందిన నేతలు నాయకత్వం వహిస్తారు. ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహిస్తారు. అలాగే మిగిలిన ఆరు బృందాలకూ.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, అదే పార్టీకి చెందిన వైజయంత్ పాండా, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన (ఏక్ నాథ్ షిండే) ఎంపీ శ్రీకాంత్ నాయకత్వం వహిస్తారు. కాగా ఈ బృందాలలో ముగ్గురు తెలుగు ఎంపీలకు కూడా స్థానం దక్కింది.
రాజమహేంద్రవరంఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రవిశంక్ ప్రసాద్ నేతృత్వం వహించే బృందంలో సభ్యురాలు. ఈ బృందం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్ లలో పర్యటిస్తుంది. అలాగే… ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలె నాయకత్వంలోని బృం దంలో నరసరావుపేట ఎంపీ, తెలుగుదేశం నాయకుడు లావు కృష్ణదేవరాయులు సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం ఈజిప్ట్, క్వటార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలలో పర్యటిస్తుంది. ఇక శశిథరూర్ నేతృత్వం వహించే బృందంలో అమలాపురం ఎంపీ జీఎం హరీష్ బాలయోగి సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందం అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలలో పర్యటిస్తుంది.