posted on May 20, 2025 4:37PM
జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆహ్వానం నుండి భోజనాల వరకు అన్నీఈ కమిటీలే చూసుకుంటాయి.
మొత్తంగా మహానాడుకు సంబంధించి సమన్వయ బాధ్యతలన్నీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూసుకుంటారు. నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి, పార్టీ ఎంపీ రామ్మోహన్నాయుడు కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 19 కమిటీలకు సంబంధించి ఒక్కో కమిటీలో పది నుంచి 20 మంది ఉంటారు. పల్లా శ్రీనివాస్, బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీ, నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ, యనమల ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చెన్నాయుడి నేతృత్వంలో వసతి , రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్రెడ్డి నేతృత్వంలో భోజనాల కమిటీలను ఏర్పాటు చేశారు.
ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అదే విధంగా కడపలో మహానాడు నిర్వహించడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక మహానాడులో తొలి రోజు అంటే మే 27న పార్టీ అధినేత ఎన్నిక కోసం చంద్రబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమం ఉంటుంది. రెండో రోజు పార్టీ చంద్రబాబును పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది. అలాగే రెండో రోజు వివిధ అంశాలు, సమస్యలపై చర్చ జరుగుతుంది. చివరి రోజు పార్టీ పలు తిర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదిస్తుంది. అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుంది.