posted on May 13, 2025 12:23PM
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్’సిందూర్, భారత్ , పాకిస్థాన్ మధ్య మినీ వార్ , కాల్పుల విరమణ తదనంతర పరిణామాలు, విశ్లేషణలు,విమర్శల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (మే 12) ర్రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిజానికి, పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాన మంత్రి మోదీ మౌన సందేశమే కానీ, నోరు విప్పి మాట్లాడింది లేదు. అఫ్కోర్స్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఒకటి రెండు రోజులకు బీహార్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ స్పందించారు. ఉగ్రవాదాన్ని క్షమిచేంది లేదని అన్నారు .ఉగ్రవాదంపై యుద్దాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నపాక్ కు గట్టి హెచ్చరిక చేశారు. ఆ తర్వాత మోడీ మళ్ళీ, పెదవి విప్పలేదు. ఒక్క ముక్క ఆయినా మాట్లాడలేదు.
కానీ.. ఆయన మౌనం మాట్లాడుతూనే వుంది. ఉగ్రదాడి జరిగిన పక్షం రోజుల తర్వాత పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిదూర్ పేరిట క్షిపణి దాడులు చేసింది. తొమ్మిది స్థావరాలనూ నేల మట్టం చేసింది. 25 నిముషాల వ్యవధిలో 100 కి పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టింది. అలాగే.. భారత్ దాడులకు ప్రతిగా పాక్ జరిపిన డ్రోన్ దాడులను భారత ఆర్మీ సమర్థంగా తిప్పి కొట్టింది. పాక్ వైమానిక స్థావరాలను లేపేసింది. చివరకు పాక్ చేతులెత్తేసే స్థితికి చేరుకున్న సమయంలో.. అనూహ్యంగా మోదీ కాల్పుల విరమణ ప్రతిపాదనకు తలూపారు. విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం (మే 12) రాత్రి మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒక విధంగా.. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ, దేశంలో అంతర్గత రాజకీయ యుద్ధానికి తెర తీసింది.
అయితే.. సుమారు 20 నిముషాల పాటు సాగిన ప్రసంగంలో మోదీ దేశం ముందున్న ప్రశ్నలకు సమాధానంచెప్పారా.. అంటే విశ్లేషకులు చెప్పారనో లేదనో సమాధానం చెప్పడం కష్టమే అంటున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణ విషయంలో విభిన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో నిజం ఏమిటన్నది, నిలకడ మీద గానీ తెలియదు. కానీ.. ఈలోగా జరగవలసిన నష్టం జరిగి పోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరో పరాయి వారో, ప్రతిపక్షాలో కాదు.. సొంత మనుషులే కొంత మంది మోదీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తప్పు పడుతున్నారు. విజయం స్వాగతం పలుకుతున్న సమయంలో మోదీ ఎందుకు వెనకడుగు వేశారు, కాల్పుల విరమణ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అన్న ప్రశ్నలు, సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. అన్నిటినీ మించి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని ‘ఆపు’ అనగానే జీహుజూర్ అంటూ మోడీ, అస్త్ర సన్యాసం ఎందుకు చేశారు? దేశం మొత్తం భారత సైనిక సామర్ధ్యాన్ని చూసి మురిసి పోతున్న సమయంలో.. మోదీ దేశం నెత్తిన కాల్పుల విరమణ నీటిని ఎందుకు కుమ్మరించారు? అంటే.. వ్యూహంలో భాగమనో, ఇంకొకటనో తప్పించు కోవడమే కానీ సరైన సమాధానం లేక బీజీపీ నాయకులు, అభిమానులు బేల చూపులు చూస్తున్నారు.
ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రధానంగా బీజేపీ, నాయకులు, కార్య కర్తలు, అభిమానులకు ఇచ్చిన సందేశంగా తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ మొదలు కాల్పుల విరమణ వరకు జరిగిన పరిణామాలను, భవిష్యత్ ప్రణాళికను దేశ ప్రజలకు వివరించేందుకు మంగళవారం (మే 13) నుంచి 11 రోజుల పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ ‘తిరంగ యాత్ర’ నిర్వహిస్తున నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం పార్టీకి ఇచ్చిన సందేశంగానే భావించాలని అంటున్నారు. జాతిని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగంలో దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం పెద్దగా లేదని అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా కాల్పుల విరమణకు సంబంధించి వివరణ ఇవ్వడంలో మోదీ విఫలమయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అయితే.. అదే సమయంలో మోదీ ప్రసంగంలో పాకిస్థాన్ కు , ప్రపంచానికి రెండు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని బీజేపీ అనుకూల వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కాల్పుల విరమణకు సంబంధించి దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను, విమర్శలను తిప్పికొడుతూ.. బీజేపీ అనుకూల విశ్లేషకులు ప్రధాని తమ ప్రసంగంలో కాల్పుల విరమణ తాత్కాలికమని స్పష్టం చేశారని, ఉగ్రవాదం నిర్మూలన విషయంలో పాకిస్థాన్ వ్యవహరించే తీరును బట్టే.. కాల్పుల విరమణ పై భవిష్యత్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారని అంటున్నారు.అలాగే, పాక్ తో చర్చలు అంటూ జరిగితే, ఒకటి ఉగ్రవాదం, రెండు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ఈ రెండు విషయాలపైనే ఉంటాయని, ఇతర విషయాలపై చర్చలు ఉండవని స్పష్టం చేశారని అంటున్నారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం, ప్రసంగం కాదు పాక్ పై కురిపించిన మిస్సైల్ దాడితో సమానమని బీజేపీ అనుకూల వర్గాలు, అనుకూల విశ్లేషకులు అంటున్నారు.
అయితే.. విపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, కాల్పుల విరమణ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్’ వరసగా చేస్తున్న ప్రకటనలను మోదీ తమ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని తప్పు పడుతున్నాయి. అయితే.. బీజేపీ అనుకూల వర్గాలు మాత్రం ఆ ఒక్కటీ అడగొద్దు అన్నట్లుగా ఆ ఒక్క విషయాన్ని వదిలేసి మోదీ ప్రసంగాని, సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. అంతిమంగా మోదీ ప్రసంగం ఎవరి కోసం? ఎందుకోసం? ప్రసంగంలో ఏముంది? ప్రసంగం సారాంశం ఏమిటి.. అన్నది, సమధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.