ప్రస్తుతం తెలుగు సినిమా తీరు తెన్నులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. తెలుగు హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు, భారీ యాక్షన్ సినిమాల వైపు పరుగులు పెడుతున్నారు. వారికి నచ్చే సినిమాలు తప్ప ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకే టాప్ హీరోలంతా టాప్ డైరెక్టర్లనే నమ్ముకుంటున్నారు. అడపా దడపా కొత్త డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. అయితే ఆ సినిమాలు కూడా యాక్షన్ ఓరియంటెడ్గానే ఉంటున్నాయి. కొత్తగా వచ్చే డైరెక్టర్ల దగ్గర ప్రేక్షకుల మనసుకు హత్తుకునే కథలు తప్పకుండా ఉంటాయి. అయితే మన హీరోలు వాటి జోలికి వెళ్ళకుండా.. తమను యాక్షన్ హీరోగా ఎలివేట్ చేసే కథలతోనే ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో మన హీరోలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదన్నది వాస్తవం. ఇదిలా ఉంటే.. విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తమ టాలెంట్ ఏమిటో ప్రూవ్ చేసుకుంటున్న డైరెక్టర్లు కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. అలా వచ్చిన సినిమాల్లో ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘బలగం’ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రెండు సినిమాలూ ఎవరూ ఊహించని కథలతో వచ్చి ఘన విజయాలు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించాయి.
‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాన్ని రూపొందించిన వెంకటేష్ మహా.. దర్శకుడే కాదు, నటుడు, రచయిత, నిర్మాత కూడా. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలతో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’ తర్వాత సత్యదేవ్ హీరోగా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాన్ని రూపొందించారు. ఇది ఓ మలయాళ చిత్రానికి రీమేక్. కరోనా టైమ్లో ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్పై రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత 2021లో డా.రాజశేఖర్తో ‘మర్మాణువు’ అనే సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు వెంకటేష్ మహా. ఈ గ్యాప్లో మోడరన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేశారు. అలాగే మార్టిన్ లూథర్ కింగ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే కొన్ని సినిమాల్లో నటించారు కూడా.
తాజాగా ఇప్పుడు మరో విభిన్న కథాంశంతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ఎనౌన్స్మెంట్లు, హడావిడి లేకుండా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారని సమాచారం. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 25 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. వెంకటేష్ మహా మీద ఉన్న నమ్మకంతోనే సత్యదేవ్పై నిర్మాతలు అంత పెట్టుబడి పెడుతున్నారట. ఈ విషయంలో నిర్మాతలు రిస్క్ చేస్తున్నారనేది వాస్తవం. ఎందుకంటే ఇటీవల సత్యదేవ్ హీరోగా జీబ్రా అనే చిత్రం రిలీజ్ అయింది. అతని కెరీర్లో ఇదే ఎక్కువ బడ్జెట్తో తీసిన సినిమా. ఇప్పుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా బడ్జెట్పరంగా జీబ్రాను మించిన సినిమా అవుతుంది. ఈ సినిమాకి ‘రావు బహద్దూర్’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. టైటిల్ని బట్టి చూస్తే ఇది బ్రిటీష్ కాలం నాటి కథ అని అర్థమవుతుంది. వెంకటేష్ మహా గత చిత్రాలను బట్టి చూస్తే ఇది కూడా తప్పకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న సినిమా అనిపిస్తుంది. షూటింగ్ అంతా సైలెంట్గా పూర్తి చేసి ఆ తర్వాత పబ్లిసిటీ గురించి ఆలోచించాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కమర్షియల్ సినిమాలంటే వెంకటేష్ మహాకి ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉన్నట్టు ఆమధ్య అతను చేసిన కామెంట్స్ వల్ల తెలిసింది. మరి మొదటిసారి హై బడ్జెట్తో నిర్మిస్తున్న ‘రావు బహద్దూర్’ చిత్రాన్ని ఎలాంటి కమర్షియల్ సినిమాగా తియ్యబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.