దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు గురవుతున్న బెట్టింగ్ యాప్స్ సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలు ఈ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవడం అడ్డుకోవడానికి సరైన విధానం లేకపోవడంతో, ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో, ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తోంది. దీని ద్వారా, బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసే వారిని గుర్తించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉన్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ వీటిని ఉపయోగిస్తూ బెట్టింగ్లో పాల్గొంటున్నారు. దీంతో, ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ శాఖ సహాయంతో అభివృద్ధి చేస్తున్న ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా, బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన వ్యక్తుల వివరాలు వెంటనే అధికారులకు అందేలా చేసే విధానం తీసుకురాబోతోంది.
సైబర్ విభాగం అందజేసే ఈ సమాచారం ఆధారంగా, సంబంధిత మొబైల్ ఫోన్ను బ్లాక్ చేసే మార్గాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ చర్యలపై త్వరగా అమలుకావాలనే ఉద్దేశంతో హోంశాఖ, ఐటీ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం, ఐటీ శాఖ ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనను వేగవంతం చేస్తోంది. అభివృద్ధి పూర్తైన వెంటనే, హోంశాఖకు అందజేసి అమలు చేయనున్నారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా తన తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ కొత్త వ్యూహంతో, బెట్టింగ్ యాప్స్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది.